10/23/13

పుస్తకాలతో నాన్నగారి కబుర్లు - 2

అమ్మ కడుపు చల్లగా

రచన -శ్రీ గొల్లపూడి మారుతీ రావు గారి ఆత్మ కథ

పరిచయం - మైలవరపు యజ్ననాధం



అభిమాన రచయితకొక ఆత్మీయ లేఖ



మాన్య శ్రీ  గొల్లపూడి మారుతీ రావుగారికి,

నమస్తే, ఉభయకుశలోపరి.

ఈమధ్య మీ ఆత్మకథ 'అమ్మ కడుపు చల్లగా' చదివే అవకాశం లభించింది. మీ ఆ రచన వెలువడి సుమార 5 సం ॥ లు గడిచిపోయినా నాకు అది చదివే అవకాశం ఈ మధ్యే దొరికింది. నాకు వచన రచనల్లో ముఖ్యంగా ఆత్మకథలు చాలా ఇష్టం. ఇదివరలో తిరుపతి వేంకట కవుల కథలు - గాథలు, టంగుటూరి వారి నా జీవిత యాత్ర, తిరుమల చంద్ర గారి హంపీ నుండి హరప్పా దాకా, శ్రీపాద వారి అనుభవాలూ - జ్నాపకాలూ, డా. ఉప్పల లక్ష్మణ రావుగారి బ్రతుకు పుస్తకం, బాల్యం లో చిలకమర్తి వారి స్వీయ చరిత్ర, కందుకూరి వారి స్వీయ చరిత్ర కూడా చదివాను. వీరిలో కొందరి రచనా శైలీ, గడుసుతనం నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి విలక్షణమైన రీతిమ, తీరూ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వారి రచనలో భేషజం కనపడదు. అత్మాయతా స్పర్శ కనపడుతుంది. ఆ లక్షణం మళ్ళీ మీ రచనలో కాన వచ్చింది. మీ రచన ద్వారా మీరు ఆత్మీయులు గా కనిపించారు. అందుకే మీకీ ఆత్మీయ లేఖ.

'గద్యం కవీనాం వికషం వదన్తి ' అన్నారు పెద్దలు. వచనం రాసి మెప్పించడం కొద్దిమందికే సాధ్యం అయిన విషయం. ఏ రచన గానీ మధ్య లో వొక పేజీ తీసి చదివినా 'ఇది ఫలానా వారి రచన ' అని గుర్తించగలిగిన నాడు, ఆ రచయితకి తిరుగు లేని గుర్తింపు లభించినట్టే. ఆ ముద్ర వేయడం ఏ కొద్దిమందికో గానీ సాధ్యం కాదు. వచన రచనల్లో, స్వీయ చరిత్రలు, నవలలు, కథలు, కథానికలు పలువురివి చదివాను. వాటిలో బేరీజు వేసి చూసినప్పుడు, మీ వొక్కరి రచనా శైలి మాత్రమే శ్రీపాద వారి రచనల సరసన చేరగలదనిపించింది. ఇది మెనమెచ్చు కాదు. నిజాయితీ గా చెప్పిన మాట.

మహా పురుషుల జీవిత చరిత్రలూ, సమాజం లో కొంత పేరు సంపాదించిన వారి చరిత్రలు గ్రంధస్తం చేయబడ్డాయి. కానీ వాటిలో అతిశయోక్తులూ, భట్రాజు పొగడ్తలూ,కొండొకచో విసురులూ చేరి, వాస్తవాలు మరుగున పడవచ్చు.
కానీ స్వీయ చరిత్ర నిజాయితీ గా రచించిన నాడు, అందులో ఆ వ్యక్తి సమగ్ర జీవిత స్వభావ చిత్రణ, వానితో పాటే సమకాలీన సమాజ చిత్రణా - ఇత్యాది అంశాలను చక్కగా గమనించడానికి మంచి అవకాశం దొరుకుతుంది. 

స్వీయ చరిత్రలలో ఆత్మస్తుతి, పరనిందా కాకుండా నిజాయితీగా తమ బలహీనతలను, వోటములనూ కూడా వదలకుండా గ్రంధస్తం చేసినప్పుడు, ఆ మనిషి విలువ మరింత పెరుగుతుంది. మీ జీవిత చరిత్ర కేవలం మీ జీవిత చరిత్ర మాత్రమే కాకుండా ఇటీవలి ఆంధ్ర సారస్వత నాటకచరిత్రలో వచ్చిన పరిణామ క్రమాల దిక్సూచి కూడా.

నిజాయితీగా మీ బలహీనతలనూ, పరాజయాలనూ గ్రంధస్తం చెయ్యడం ద్వారా మీ విలువను మరింత పెంచుకున్నారు.లబ్ధప్రతిష్ఠులయిన వ్యక్తులతో మీ పరిచయాన్నీ, సాన్నిహిత్యాన్ని అలవోకగా ప్రస్తావించి తప్పుకున్నారు. వాటిని hilight చేయడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. మీరు సాధించిన విజయాలను కూడా నమ్రతతోనే ప్రస్తావించడం నన్ను మరింత ఆకట్టుకుంది.

మీ శ్రీమతి యెడల, మీ చిరంజీవుల యెడల మీరు చూపే చిరాకూ, ఒకప్పటి చిత్తూరు నాటక ప్రదర్శనలో స్థానిక తహసిల్దారు మీద మీరు ప్రకటించిన చిరుకోపం, దానిపై శ్రీ బి.కె. రావు (రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి) మిమ్మల్ని సున్నితంగా మందలించిన తీరు - ఇటువంటివి కూడా విడిచిపెట్టకుండా మీ ఆత్మకథ లో స్థానం కల్పించడం మీ సమగ్ర ఆలోచనా విధానానికి మచ్చు తునక.

ముఖ్యంగా మీ కుటుంబం మీద మీకుగల గాఢమైన అనుబంధం చాలా ముచ్చటగొలిపింది. అమ్మగారి యెడల మీకున్న అచంచలమైన భక్తి, చాలామంది మా వంటి వారికి ఆదర్శప్రాయం. అలాగే సహోద్యోగుల మీదా, మీ అభిమానుల మీదా మీకుగల అభిమానం ప్రశంశనీయం.

 అన్నింటికంటే ఎక్కువ నా మనసుని హత్తుకున్నది, స్వర్గస్తులయిన మీ కుమారుడు, శ్రీనివాసుగారిని స్మరిస్తూ, ప్రతిసంవత్సరం మీరు నిర్వహించే స్మారక బహుమతి ప్రదానోత్సవాలు, మొక్కుబడిగా కాకుండా, వారి యెడల మీకుగల ఆప్యాయత చాటుతూ, చలన చిత్ర రంగంలో తెరవెనుక కృషి చేసే సాంకేతిక నిపుణులూ, దర్శకులూ అయిన పలువురు మేధావులను మీరు సత్కరించే విధానం, స్వర్గం నుంచి మీ చిరంజీవి సహస్ర చక్షువులతో చూసి ఆనందిస్తాడని నా ప్రగాఢ విశ్వాసం.

చలనచిత్ర నటుడిగా, నాటక ప్రయోక్త గా,రంగస్థల నటుడిగా ఇప్పటికే మీరు ఎంతో మంది అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. కోట్లాది అభిమానులని సంపాదించుకున్నారు. మిమ్మల్ని రచయిత గా ఆరాధించినా, విలక్షణమయిన మీ నటన, సాహితీ సేవకు ఎంతమాత్రం తీసిపోదు.

చాలా మంది ఏదో ఒక రంగంలో కృషి చేసి పేరు తెచ్చుకుంటారు. కానీ మీరు రచయితగా, నాటక ప్రయోక్తగా, రంగస్థల నటుడిగా, చలన చిత్ర రంగంలో మాటల రచయితగా, చలనచిత్ర దర్శకునిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. చందోబధ్ధమయిన కవితలల్లారు. నాట్యరంగంలో- శాస్త్రీయ సంగీతంలో కూడా తగుపాటి అవగాహన వున్నట్లు మీరు పాల్గొన్న కవిసమ్మేళనాల వల్ల తెలుస్తోంది.

బహుముఖంగా విస్తరించిన, ఇంకా విస్తరిస్తున్న మీ ప్రతిభా సంపత్తులను ఆసక్తిగా గమనిస్తూ, ముందు ముందు సాహితీ సాంస్కృతిక రంగాలలో మీరు చేస్తున్న కృషి మరింత వెలుగొందాలని ఆశిస్తూ మీ అభిమాని అత్మీయ లేఖ.



-యజ్ఞనాధం

గమనిక: ఈ పుస్తకం ప్రస్తుతం కినిగె లో లభ్యం.
             http://kinige.com/kbook.php?id=1355&name=Amma+Kadupu+Challaga 





9/3/13

నా కథ కౌముది లో

నా రెండవ కథ కౌముది లో చోటు సంపాదించడం చాలా సంతోషాన్నిచ్చింది.

ఈ నెల కౌముది లో నా కథ  మీసాలాడి పెళ్ళాం చదివి మీ అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తున్నా...

7/15/13

పుస్తకాలతో నాన్నగారి కబుర్లు


అందరూ పుస్తకాలు పరిచయం చేసేస్తూ, పుస్తకాల గురించి తెగ కబుర్లు చెప్పేస్తూ వుంటే...నేను కూడా బోల్డు పుస్తకాలు చదివేసి ఆ కబుర్లన్నీ రాసెయ్యాలి అనుకునేదాన్ని...ఒక్క పుస్తకం కూడా చివరి పేజీ నంబరు చూసిన పాపాన్న పోలేదు ఇంతవరకూ...

మీ నాన్నగారికేం అలా పుస్తకాల్లో మునిగి తేలుతూ వుంటారు..ఆయనకివేం పట్టవ్...లాంటి కంప్లైంట్లు అమ్మ దగ్గర చాలా కామన్ గా వినబడుతూ వుంటాయి...ఆ మధ్య ఒక పుస్తకాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు నాన్నా అంటే...అటూ ఇటు గా మూడు నాలుగు రోజుల్లో అయిపోతుందమ్మా అన్నారు...అప్పుడు నా బుర్రలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది...నేను పుస్తకం చదివి దాని గురించి రాయడం అన్నది ఇప్పట్లో జరిగే పనిలా ఎలాగూ కనిపించడం లేదు...నాన్నారు ఇలా చదివి అలా విసిరి పడేస్తున్నారు కదా...పడేసే ముందు దాని గురించి కాసిన్ని కబుర్లు రాసి పెడితే అవి నేను ఆయన పేరు మీద కొత్త బ్లాగు తెరిచి రాద్దాం(టైపు చేద్దాం) అనుకున్నా...మళ్ళీ కొత్త బ్లాగు అంటే నా బ్లాగుకున్న ట్రాఫిక్కే అంతంత మాత్రం...దాన్ని పూర్తిగా పైకి తీసుకురాగలనో అనే అనుమానం రావడంతో...నా బ్లాగులో నే ఒక శీర్షిక లో వేద్దాం అని తీర్మానించా...

నా ఈ మెరుపులాంటి ( మరి తళుక్కుమంది కదా) అలోచన చెప్పగానే...మా నాన్నగారు చాలా సంతోషించారు...వొక వారంలో తను అప్పుడు చదువుతూ వున్న పుస్తకం కబుర్లు రాసి, ఇంటర్ నెట్ కేఫ్ కి వెళ్ళి...స్కాన్ తీయించి పంపేసారు (ఇలాంటివి చెయ్యమంటే మీ నాన్నగారికి ఎక్కడలేని వుత్సాహం వచ్చేస్తుంది అని అమ్మ ఇచ్చిన సర్టిఫికెట్టు తీసుకుని మరీ). అది పంపి ఒక రెండు మూడు నెలలు అయ్యింది...కానీ నా చేతుల్లో దానికిప్పటి వరకూ మోక్షం దొరకలేదు పాపం...ఫోన్ చేసినప్పుడల్లా అడిగీ అడిగీ విసిగిపోయి ఈ మధ్య అడగడం కూడా మానేసారు...ఛీ మీ నాన్న కోసం ఈ మాత్రం కూడా చెయ్యలేవు అని ఇవాళ నా అంతరాత్మ తీవ్రం గా నిరశించే సరికి మొతానికి మొదలెట్టా ...

మొదటి పుస్తకం కబుర్లు - సృష్టి లో మధురిమలు 
రచన - శ్రీ గిడుగు రాజేశ్వరరావు
పరిచయం - మైలవరపు యఙ్ననాధమ్





కవి గురించి :
 శ్రీ గిడుగు రాజేశ్వరరావు గారు ఇదివరలో వివిధ ప్రక్రియలలో రచనలు చేశారు. కధానికలు, సంక్షిప్త జీవిత చరిత్రలు, నాటికలు వగైరా. వీరి నాటికలు కొన్ని ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి శ్రీమతి శారదా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రసారమయ్యాయి. అంతేకాకుండా శ్రీ రాజేశ్వరరావుగారు వ్యావహారిక భాషోద్యమ రధ సారధి. గ్రాంధిక భాషా వాదుల పట్ల సింహస్వప్నం అనదగ్గ,  రావు సాహెబ్ గిడుగు రామ్మూర్తి పంతులు గారి మనుమలు. కానీ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవలసిన అవసరం మాత్రం వీరికి ఏనాడూ కలగలేదు. వారే స్వయంగా చేయి తిరిగిన రచయితా, మేధావీ...

 పుస్తక పరిచయం:
సగటు పాఠకుడు పద్యం - వచనం- నవల - కథ వీటిలో చక చకా సాగిపోయే నవలో, లేక కథల వైపో ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. పద్యం అనేసరికి ఒక రకమైన భయం - బెరుకు వుంటాయి.

ఐతే పద్యం మీద సహజంగా ఉండే ఆ భయాన్ని పోగొట్టే ఒక పద్య సంపుటిని ఈ మధ్యే చదవడం జరిగింది. అదే 'సృష్టి లో మధురిమలు '. సప్తవర్ణ దృస్యమాలికతో అనుసంధానమైన రచన. ఇందులోని రచనలు - గేయాలు కావు, వచన కవితలు కావు. తేట యైన తేటగీతుల సంపుటి.

తాను వివిధ సందర్భాలలో, వివిధ ప్రదేశాలలో వీక్షించి పరవశించిన ప్రకృతి చిత్రాలను, సప్త వర్ణాత్మక ఛాయా చిత్రాలుగా బంధించి...వాటితో పాటు పొందు పరిచిన పద్యాల విరిమాల ఈ సంపుటి.

ఈ పద్యాలలో ఎలాంటి శబ్దాడంబరాలు, అలంకారాభరణాలు, అన్వయ కాఠిన్యాలూ లేవు. సూటిగా, సహజ సుందరంగా, నిరాడంబరంగా ఉన్నాయి. ఇవి ముక్తకాలు. ఏ పద్యానికి ఆ పద్యం చదివి ఆనందించవచ్చు. ప్రకృతి గురించి, మానవుల
స్వభావ వైచిత్రి గురించి, అదే సమయంలో ప్రకృతిలో పశు, పక్ష్యాదుల నిర్హేతుకమైన, అవ్యాజ్యానురాగాల గురించి కవి చేసిన విశ్లేషణ చాలా చక్కగా, ఎక్కడా విభేదించే అవకాశం లేని విధంగా వుంది.

కాలం నీటి ధారలా వేళ్ళ సందుల్లోనుంచి జారిపోతుంటే, మధురమైన క్షణాలని మరిచిపోకుండా భద్రపరిచిన తీపి గురుతుల పేటిక వంటి ఈ సంపుటి, ద్రాక్షా పాకం. అన్ని ద్రాక్షలూ వుదాహరణ యోగ్యమే అయినా, మచ్చుకి కొన్ని ఇక్కడ వుంచుతున్నాను.

ప్రకృతి ఒడి లో శిశువుగా పరవశించే వేళ కేరింతలుగా వచ్చిన తేటగీతి ఇది.

ప్రకృతి ఒడిలోన శిశువునై పరవశించచు
వేళ, కేరింతలై నోట వెడలి వచ్చె
తేటగీతుల రూపాన తియ్యనైనన
పద్యములు - తల్లి అందాలు ప్రస్తుతింప

కొన్ని మచ్చు తునకలు












 నిరంతరం తిరిగే సృష్టి చక్రానికి కందెన ప్రేమ తత్వమే కానీ, పగా - ద్వేషం కాదు. మానవుడు ప్రకృతికి దూరం గా జరిగిపోతున్నాడని 'డేవిస్ ' వందేళ్ళ క్రితమే విచారించాడు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే చెప్పలేనంత దూరమే జరిగిపోయాడాన్నది కళ్ళ ముందున్న చేదు నిజం. ప్రకృతిని దైవంగా భావించి ఆరాధించడం, పంచ భూతాలను, పశుపక్ష్యాలను, శిలలనూ కూడా దైవాలకు ప్రతిరూపాలుగా భావించి అర్చించడం అనూచానంగా వస్తున్న మన హైందవ భావన. ఈ భావననే మరొక రకంగా సృష్టిలోని మధురిమలని గుర్తించి, ప్రకృతిని ఆరాధించడం కూడా ఉత్తమ భక్తి మార్గమని నమ్ముతునానన్న శ్రీ గిడుగు చక్కని ఈ భావన సర్వదా సవ్యధా శిరోధార్యం.

మానవునిలో పెరిగిపోతున్న నిర్హేతుక క్రోధం, పగ, ద్వేషం అంతరించాలని, మన బుధ్ధి సత్యమైన మార్గంలో పయనించి శాంతి, సహృదయత వెల్లి విరియాలని, ఆ సుగుణాలని అలవరుచుకోడానికి ఇటువంటి రచనలు కొంతవరకైనా వుపకరిస్తాయని ఆశ, ఆకాంక్ష..


     



4/3/13

శ్రధ్ధాంజలి

వాళ్ళ నాన్న గారి చిటికెన వేలు పట్టుకుని బజార్లో అది కావాలీ...ఇది కావాలి అని పేచీలు పెడుతున్న బుల్ల్లి బావ, ఇంకా నాన్నగారి మనసులో మెదులుతూనే వున్నాడు...

నాన్నతో పాటు పెళ్ళి చూపులకొచ్చిన చిట్టి అల్లరి పిడుగు, అమ్మ కళ్ళల్లో ఇంకా కదులుతూనే వున్నాడు...

నీ పేరేవిటే 'స్ఫురించడం' లేదూ అంటూ ఆటపట్టించే తన మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ఇంకా పెదవులమీద చిరునవ్వులు పూయిస్తూనే వున్నాయి...

నా పెళ్ళికి అడక్కుండానే రెండు రోజుల ముందు సెలవు పెట్టుకుని వచ్చి...నీకు సాయం చేద్దామని ముందే ఇంటికి వచ్చా బావా అని ఫోన్ చేసి చెప్పినప్పుడు నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం, ధైర్యం ఇంకా నా జ్ఞాపకాల్లో సజీవంగా అలానే వున్నాయి...

ఎవరి పనుల్లో వాళ్ళు పడి చెల్లాచెదురైపోయిన బంధువులందర్నీ ఒక చోటకి చేర్చి ఫామిలీ రీయూనియన్ అని తను చేసిన సందడి అందరి గుండెల్లో ఇంకా భద్రంగానే వుంది...

మెరుపులా ప్రత్యక్షమయ్యి...నాకోసమేనా అక్కా పకోడీలు చేస్తున్నావ్ అని చనువుగా వంటింట్లో అమ్మని పలకరించేసి...నాన్నతో నాలుగు కబుర్లు చెప్పేసి...ఫోన్ లో నన్ను పలకరించేసి అప్పటివరకూ వుదాసీనం గా వున్న మా మనసుల్లో వుత్సాహం నింపేసి...ఏదో పని గుర్తొచ్చిందంటూ చటుక్కున మాయం అయిపోయే ఆ అనుకోని అతిధి పలకరింపులు, ఇంక కనపడవని నమ్మడానికి  వొప్పుకోనని మనసు మొరాయిస్తోంది...

తను ఈ ప్రపంచం తో సంబంధం తెంచేసుకుని పదిరోజులు దాటిపోయినా ... ఎప్పుడూ నవ్వుతూ పలకరించే తన గొంతు మా చెవుల్లో పదిలంగానే వుండిపోయింది...పైకి వేలాకోళాలాడినా... తన మాటల వెనక వున్న అభిమానం మా గుండెల్లో చెక్కు చెదరకుండా అలాగే వుంది...

మరణం మనిషితో పాటూ ప్రాణం ఒక్కటే తీస్కుకుపోతుందా అంటే...కొందరి జీవితాల్లో సంతోషం, నమ్మకం, ఆసరా కూడా ఆ ప్రాణం తనతో పాటూ లాక్కెళ్ళిపోతుంది...కొందరు మనుషులు మాత్రం...మృత్యువుకతీతంగా  తమదైన ముద్ర  తోటివారికి విడిచిపెట్టి  మన మధ్యలోనుండి చెప్పకుండానే మాయమైపోయినా... మనసు పొరల్లో గూడు కట్టుకుని మన చుట్టూనే తిరుగుతూ వుంటారు...

నువ్వు మా మధ్య లేకపోయినా, వున్నన్నాళ్ళూ నవ్వుతూ నవ్విస్తూ చేతనైన సాయం చేస్తూ బతకాలని... 'నన్ను చూసి నేర్చుకో' అని నోటితో చెప్పకుండానే ...జీవించి చూపించి నువ్వు ఇచ్చిన స్ఫూర్తి మాతో ఎప్పటికీ వుండిపోతుంది....

(పది రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన మా శర్మ మావయ్యకి శ్రద్ధాంజలి...ఆయన కుటుంబానికి...ఈ లోటుని తట్టుకునే శక్తి ని, ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ...)




2/20/13

చిలక పలులకులు - 2

నా చిన్నప్పుడు నేనన్న మాటలు...చేసిన చిలిపి పనులు ఇప్పటికీ మా అమ్మ కధలు కధలు గా చెబుతూ వుంటుంది. కానీ నాకు ఇప్పుడే ఏదన్నా వెతుకుతూ వెతుకుతూ అసలేది వెతుకుతున్నానో మర్చిపోవడం, కొంతమంది పేర్లు గుర్తుకు రాకపోవడం వచ్చేసి, నా మెదడు మీద నమ్మకం తగ్గుతోంది ఈ మధ్య. నా కూతురు పెద్దదయ్యాక దాని చిలక పలుకులు దానికి గుర్తుంచుకుని చెప్పగలనో లేదో అని ఇలా రాసి దాచుకుంటున్నాను. ఆ మధ్య మరీ బుజ్జి చిలక పలుకులు రాసుకున్నా..ఇప్పుడు కాస్త తెలిసీ తెలియని చిట్టి పొట్టి మాటలు మాట్లాడే చిలకా ఇంకా దాని నేస్తాల కబుర్లు...
ఇండియా లో ఇంచుమించు రెండేళ్ళు వుండడం వల్ల మా చిట్టితల్లికి తెలుగు చక్కగా వచ్చేసింది. ఇక్కడకొచ్చి డేకేర్ కి వెళ్ళడం మొదలెట్టాక దాని మొదటి ఛాలెంజ్ తోటి పిల్లలతో వాళ్ళకర్ధమయ్యే భాషలో మాట్లాడ్డం. ఇంటికొచ్చాక ప్రతీదీ ఇంగ్లిష్ లో ఎమంటారో అడుగుతూ వుండేది కొన్నాళ్ళు. కాసిని రోజులు గడిచేసరికి సొంత ప్రయోగాలు మొదలెట్టేసింది. మా వాడు పుట్టిన కొత్తలో దాని తో ఆడుకోడానికొచ్హ్చిన పాప where is your bother? what is he doing? అని అడిగింది...మా పిల్ల తడుముకోకుండా చెప్పింది My bother is milking అని...:)

వొకరోజు ఇద్దరు స్నేహితుల కుటుంబాలని భోజనానికి పిలిచాం. పిల్లలంతా కలిసి గోల గోల గా ఆడుకుంటున్నారు. కొంచెం సేపటికి అందులో పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని తప్పించుకుని ఆడుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టారు. మా చిన్నప్పుడు పాపం మా పిన్ని కూతుర్ని ఇలాగే అప్పుడప్పుడూ ఏడిపించే వాళ్ళం :)... మా అమ్మాయి వెళ్ళి అందులో వొక పిల్లాడి తల్లి కి కంప్లయింట్...ఆంటీ అన్న నన్ను ఆడించడం లేదని. ఆవిడ నవ్వి, వెళ్ళి చెప్పూ ఇది మా ఇల్లూ...నన్నాడించకపోతే బయటకి పంపేస్తా అని...అని చెప్పి పంపేసారు...అది పిల్లలున్న గదిలోకి వెళ్ళి గట్టిగా చెప్పింది...ఇదిగో ఇది ఆంటీ వాళ్ళ ఇల్లంట...నన్నాడించకపోతే అందర్నీ బయటకి పంపేస్తా అని చెప్పమన్నారు అని అరిచింది...ఆ పిల్లలకి ఏమీ అర్ధం కాక తెల్ల మొహాలు వేసారు గానీ...పెద్దాళ్ళంతా వొకటే నవ్వు...

మొన్న శనివారం సాయంత్రం పాత స్నేహితులొచ్చారు. వాళ్ళకి ఇద్దరు మగ పిల్లలు. పెద్దాడికి ఏడేళ్ళూ, చిన్నాడికి రెండున్నరా. అందరూ యధావిధి గా ఇల్లు పీకి పందిరేసే కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఇంతలో మా బుడ్డోడు నిద్రకి పడ్డాడు. తమ్ముడు పడుకుంటున్నాడమ్మా గట్టిగా అరవకండీ అని రెండు మూడు సార్లు చెప్పినా మా మాటలు చెవికెక్కించుకునే పరిస్థితుల్లో ఎక్కడా లేరు. మా అమ్మాయి ని కాస్త గట్టిగా అరిచాను గొడవ ఆపమని. చిన్నోడికి వాళ్ళ అన్నని ఏదో అనేస్తున్నా అని కంగారొచ్చేసింది. అప్పటిదాకా ఏదో మూల వొక బొమ్మ పని పడుతున్న వాడల్లా వచ్చేసి నాకేసి కోపంగా వొక చూపు చూసి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని యుధ్ధానికొచ్చినట్టు నించుని stop it. This is my brother. అన్నాడు. వాడి మొహం చూస్తే భలే ముచ్చటేసింది. ఏమంటాడో చూద్దామని. No, this is my daughter. I can shout at her అన్నా మా పిల్ల చెయ్యి పట్టుకుని. వెంఠనే మా పిల్ల రెండో చెయ్యి పట్టుకుని stop it. This is my daughter అన్నాడు అదే చూపు కఅంటిన్యూ చేస్తూ...:)

నిన్న రాత్రి అందరూ పడకకి వుపక్రమించాక నేనింకా వంటింట్లో ఏదో సద్దుతుంటే మా అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వొక సొరుగు లాగి ఏదో వెతికింది. ఏవిటి వెతుకుతున్నావ్ అంటే చెప్పదు. ఇదేనా అమ్మమ్మా అనుకుంటూ మిరియాల పాకెట్ పట్టికెళ్ళింది పడగ్గదిలోకి. మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి అదక్కడ పడేసి ఇంకేదో వెతకడం మొదలెట్టింది. ఏవిటే అని మళ్ళీ కాస్త గొంతు పెంచి అడిగితే అమ్మమ్మ కి ఆవుండలు కావాలంట అంటుంది. ఇంతలో అమ్మ వచ్చింది. ఏవిటి తెమ్మన్నావమ్మా దాన్ని అంటే నేనేవి తెమ్మనలేదే ఆవులింతలొచ్చేస్తున్నాయ్ అన్నా అప్పట్నుండీ ఇలా అన్నీ తెచ్చేస్తోంది అన్నారు. ఆ ముక్క చెవిని పడగానే ఆ అవే ఆవలింతలు కావాలి. అని మొదలెట్టింది. మా అమ్మగారు ఈనో కలుపుకు తాగుతుంటే నాకూ ఆవలింతలు పెట్టమ్మమ్మా అని వొకటే గోల. ఆవలింతలంటే తాగేవో తినేవో కాదమ్మా అంటే వొక పట్టాన వొప్పుకోలేదు...:)

ఈ మధ్య ఇంగ్లిష్ బాగానే మాట్లాడేస్తోంది, తప్పులూ తడకలూ ఎన్ని దొర్లినా...ఇంటికొచ్చాక కూడా అదే భాషలో బాదేస్తుంటే ఎక్కడ చక్కగా వచ్చిన తెలుగు అప్పుడే మర్చిపోతుందో(కొన్నాళ్ళకెలాగూ తప్పదన్న కఠోర వాస్తవం తెలిసినా) అని భయమేసి ఇంటికొచ్చాక తెలుగు లోనే మాట్లాడాలి అని చెప్పాను. వాళ్ళ నాన్న దగ్గరకెళ్ళి అమ్మకి ఇంగ్లిష్ రాదు పాపం. నన్ను తెలుగులోనే మాట్లాడమంటోంది అని తేల్చి పారేసింది.



10/17/12

పుట్టినరోజు జేజేలు అరవై అయిదేళ్ళ పసి పిల్లాడికి




నేను పుట్టని క్రితం అమ్మా వాళ్ళూ పొదుపూ మదుపూ అనే బెంగలేమీ లేకుండా హాయిగా వుండేవారట...అలాంటి రోజుల్లో అమ్మ ఒక వారం gap లో రెండు జతల చెప్పులు కొనడం చూసి మా తాతగారు(అమ్మా వాళ్ళా నాన్నగారు) మా నాన్నతో మీకు అరడజను మంది ఆడపిల్లలు పుడితే తెలుస్తుందయ్యా డబ్బు విలువా అని కోప్పడారట. అప్పటికే పిల్లలు లేరని బెంగ పడుతున్న నాన్నగారు...మీ నోటిమాటన అలానే పుడితే బోల్డు సంతోషం అన్నారట.

ఇది జరిగిన చాలా ఏళ్ళకి నేను పుట్టగానే మా తాతగారు ఇన్నాళ్ళ ఎదురుచూపులకి "ఆడపిల్ల"పుట్టిందని నీరసం గా telegram ఇస్తే..మా నాన్నగారు మాత్రం ఎగిరి గంతేసి మహదానందం గా చదువుకుని పరిగెట్టుకుని వచ్చారట నన్ను చూడ్డానికి.

అది మొదలు ఎప్పుడూ నేను ఆడపిల్లని కాబట్టి అన్న feeling నాలో ఏ మూలా కలగకుండా పెంచారు నాన్న. చదవకపోతే అంట్లు తోముకుంటావ్ అని అమ్మ వెంట పడేదే గానీ నాన్న మాత్రం దానికి తెలుసు ఎప్పుడు చదువుకోవాలో అని ఒక్క మాట అనేవారు. ఆ ఒక్కమాటే నాకు బోలెడు responsibility నేర్పింది. school లో బెత్తం పట్టుకుని దబదబా బాదేసే మాస్టార్ల కన్నా...చిన్న మాట కూడా అనకుండా పిల్లల్లో బోలెడంత గౌరవాన్ని సంపాదించుకున్న ఆయన నడవడిక reserved గా వుండటంలోని గొప్పతనాన్ని నేర్పించింది. జీవితంలో అప్పు అన్నది చెయ్యకుండా బతికిన ఆయన జీవన విధానం Life planning నేర్పించింది. అల్ప సంతోషి అని అమ్మ ఎప్పుడూ కసురుకున్నా...చిన్న విషయానికే సంబరపడే ఆయన తత్వం సంతృప్తి లో వుండే ఆనందం, దాని విలువా తెలియజెప్పింది. ఒక వయసు వచ్చాక వాళ్ళకి తెలుసు career planning అని ఎప్పుడూ ఇది చదువు..ఇలానే చెయ్యి అని నిర్బంధించకుండా ఆయన నాకిచ్చిన స్వేఛ్చ నాకు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పించింది.


ఇన్ని నేర్పినా ఏనాడూ నీకింత చేసాను అని గొప్పలు చెప్పుకోని ఆయన వ్యక్తిత్వం నుండి నేర్చుకోవాల్సినది ఇంకా బోలెడంత.

ప్రతీ కూతురికీ నాన్నే మొదటి హీరో...ఇవాళ్టితో అరవై అయిదేళ్ళు నిండుతున్న (ఎప్పటికీ నా దృష్టిలో హీరో) నాన్న కి పుట్టినరోజు శుభాకాంక్షలు

4/11/12

పరుగాపి...




పొద్దున్నే అయిదింటికి అల్లారం లే లే అని కుదిపి కుదిపి, చెవినిల్లు కట్టుకుని పోరేస్తోంది. అసలే చలికాలం...దాని పీక నొక్కి ఇంకొక్క పదినిమిషాలు అని తనలో తనే గొణుక్కుని దుప్పట్లో దూరింది నందిని. నిన్న రాత్రి  కుక్కరు గిన్నెలు పొద్దున్న లేచి తోవుకోవచ్చులే అని బధ్ధకించి వదిలేసిన సంగతి గుర్తురాగానే లేవక తప్పదు బాబోయ్ అనుకుని వంటింట్లోకి పరిగెత్తి నిద్ర మత్తులో చల్ల నీళ్ళ కుళాయి తిప్పేసరికి 0 కన్నా తక్కువ వుష్ణొగ్రతలో నీళ్ళు చేతిమీద సూదుల్లా గుచ్చుకుని మత్తంతా ఒక్క నిమిషం లో వదిలిపోయింది...చలికి ఎండిపోయిన గిన్నెల్ని కసిగా తోవుతుంటే ఎందుకో అమ్మ మాటలు గుర్తొచ్చాయి..."రోజూ తెల్లవారుఝామునే చదువుకోడానికి లేవదీసి బాగా చదువుకుంటే నాకులా ఇలా అంట్లు తోవుకుంటూ బతకక్కర్లేదు...కాలు మీద కాలేసుకుని దర్జాగా వుండొచ్చు. చదువుకుంటాను మొర్రో అన్నా పట్టించుకోకుండా నా తరవాత ఇంకా నలుగురాడపిల్లలున్నారని చిన్నప్పుడే పెళ్ళి చేసి పడేశారు. నీకు అన్నీ అమర్చిపెట్టి చదువుకుని సుఖపడవే అంటే అంత గునుపేవిటే"...పుస్తకం వొళ్ళో పెట్టుకుని కునికిపాట్లు పడే తనకి రోజు వంటింట్లోంచి అదే సుప్రభాతం వినపడేది.
"చదువుకుని సుఖపడవే అంటే" అన్న మాట మళ్ళీ గుర్తొచ్చి చిన్నగా నిట్టూర్చింది కుక్కరు పొయ్యిమీదకెక్కిస్తూ...అదే అమ్మ ఇప్పుడు call చేసినప్పుడల్లా  "మా కన్నా మీరేం సుఖపడుతున్నారే" అని దీర్ఘం తీస్తుంది అని నవ్వుకుంటూ స్నానాలగదిలోకి దూరింది.

ఇంట్లో మిగిలిన ఇద్దర్నీ వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకి పంపి, చివరగా తన బాగ్గు హడావిడిగా సవిరిస్తూ ..ఛా రేపట్నుంచీ అన్నీ రాత్రే సద్దిపెట్టుకోవాలి అని రోజూలాగే తిట్టుకుంటూ, కనపడని ఆఫీసు బాడ్జ్ ని మొత్తానికి సాధించి హడావిడిగా పరిగెట్టి బయటపడింది. ఎప్పట్లాగే కాస్త లేటుగా ఆఫీసు చేరుకుని సీట్లో కూలబడింది, నేనేనా అందరికంటే ఆలస్యం అని కళ్ళతోనే చెక్ చేస్కుంటూ. ఏదో వొకరోజు తొమ్మిదింటికే స్టాటస్ మీటింగు పెట్టేస్తాడు బాసు గారు..నాకు సరదా తీరిపోతుంది అని తనని తనే తిట్టుకుంటూ ల్యాపీ తెరిచింది. మైల్ చెక్ చేస్కుంటూ, "ఒక పక్కన డెలివరీ డేటు దగ్గర పడుతుంటే ఇంకా రెక్వైర్మెంట్స్ మారుస్తున్నారు ఈ బిజినెస్ వాళ్ళకి పనీ పాటా లేదు" అని తిట్టుకుంటూ పనిలో పడింది.

స్వాతి "Lunch?" అని పింగ్ చేసేసరికి అప్పుడే లంచ్ టైం అయ్యిందా అని వాచ్ చూస్కుని, తట్టెడు పనుందికదా పోనీ డెస్కు దగ్గరే కానిచ్చేద్దామా అనుకుని వద్దులే రోజు మొత్తంలో ఈ గంటేగా కాస్త సరదాగా గడిపేది అనుకుని "ok" అని పింగ్ చేసి బాగ్గు తీస్కుని కాఫటేరియా వైపు నడిచింది. అప్పటికే దేసీ గ్రూపులో చాలా మంది చేరిపోయారు అక్కడ...నందినీ, స్వాతీ చాలా రోజులుగా కలిసి పని చేస్తున్నారు...చాలా మంది భారతీయులు అక్కడ చేరినా వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక చోట కూచుని లంచ్ చేస్తున్నంత సేపూ పనిలోనూ ఇంట్లోనూ, ఎదురయ్యే కష్ట సుఖాలు కలబోసుకుంటూ వుంటారు.

ఇద్దరూ మాట్లాడుకుంటూ లంచ్ బాక్సులు విప్పుతుంటే వీళ్ళ పక్కనే వచ్చి కూచున్నాడు శ్రీకాంత్ పలకరింపు గా నవ్వుతూ, అతని బాక్సు విప్పుతుంటే ఘుమ ఘుమా వాసన వచ్చేసరికి ఏవి తెచ్చుకున్నాడబ్బా అని కాస్త కుతూహలం గా అతని బాక్సు లోకి తొంగి చూసింది స్వాతి. "ఆహా గుత్తి వంకాయ కూర"  పైకే అనేసింది...అసలే తనకి అదంటే ప్రాణం. అతను రుచి చూడండి, మా ఆవిడ చేసింది అని ఇద్దరికీ తలో కాస్తా వడ్డించాడు. ఈ స్వాతికి అస్సలు బుధ్ధిలేదు అనుకుంటూ మొహమాటం గా నవ్వింది నందిని. ఆ వేసిన కాస్త కూరా నొట్లో పెట్టుకుని చాలా బాగా చేశారండీ మీ ఆవిడ అంది. స్వాతి మాత్రం అంతటితో వదల్లేదు..."మీరెంత అదృష్టవంతులండీ...ఐతే కొత్త పెళ్ళికూతురు వంటలు అదరగొట్టేస్తోందన్నమాట" అంది శ్రీకాంత్ కి కొత్తగా పెళ్ళవడంతో... "ఆ... ఏవదృష్టమో లెండి వంటలొకటే ఆవిడ అదరగొట్టేది" అన్నాడు మహా నిరుత్సాహం గా...అదేవిటీ అలా అనేశాడు అన్నట్టు చూశారిద్దరూ అతనికేసి.

"బోల్డు చదువుకుంది...నిజం చెప్పాలంటే నాకన్నా అన్నీ మంచి గ్రేడులే...చక్కగా ఉద్యోగం చేస్తుంది...బోల్డు విలాసం గా బతకొచ్చు అనుకున్నా ఇప్పుడేమో మనకంత గండకత్తెరోమొచ్చిందీ అంటుంది ఎప్పుడు వుద్యోగం ప్రసక్తి తీస్కొచ్చినా". మరి పెళ్ళికి ముందు మీరు తనని అడగలేదా, స్వాతి అడిగేసింది..."అప్పుడు అవసరమైతే చేస్తానన్నట్టు చెప్పింది...అవసరానిదేవుంది...అదే వస్తుంది...టయోటా కారున్న వాడికి బిఎండబల్యూ కారవసరం...ఫ్యూటానున్న వాడికి లెదరు సోఫా అవసరం...దర్జా గా బతకటం అవసరమని తనే అర్ధం చేస్కుంటుంది లే అనుకున్నా...ఇప్పుడేమో మనకేం తక్కువ...ఇద్దరం రెక్కలు ముక్కలు చేసేస్కుని ఇంట్లో మనశ్శాంతి పోగొట్టేస్కునే కన్నా వున్న దాన్లో ప్రశాంతంగా పొదుపుగా బతకొచ్చుకదా అని వితండవాదం ఎప్పుడూ...ఏవిటో ఇలా అడ్డంగా దొరికిపోయాను" అని తెగ బాధ పడిపోయాడు.

 "బాధ పడకండి శ్రీకాంత్...తొందర్లోనే తను తెల్సుకుంటుంది లెండి...మాకు పరిచయం చెయ్యండి తనని...మమ్మల్నందర్నీ చూశాకా తనకి వుద్యోగం చెయ్యాలనిపిస్తుంది" అని స్వాతి అతన్ని ఓదార్చడం మొదలెట్టింది. ఎందుకో ఇంకక్కడ వుండాలనిపించక నాకు చాలా పనుంది స్వాతీ, అని త్వరగా లంచ్ ముగించేసి తన డెస్కు దగ్గరకొచ్చేసింది నందిని.

తన సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఎందుకో కాఫటేరియా సంభాషణ మనసుని వదలట్లేదు. శ్రీకాంత్ భార్య చెప్పినదాంట్లో అంత తప్పేవుంది అనిపిస్తోంది.  రోజూ ఈ అష్టావధానం తనవల్ల కావట్లేదని బోల్డు బాధపడుతుంది, ఈ స్వాతి కూడా ఏవిటి అతన్నే వెనకేసుకొస్తుంది...అసలు తామంతా విలాసాలని అవసరం గా పొరబడి బతికేస్తున్నామా...మనసుని వుక్కిరిబిక్కిరి చేస్తూ ఏవో అలోచనలు...అలోచనల్లోంచి మనసు నెమ్మదిగా జ్ఞాపకాలవైపు పరిగెడుతోంది.

తనకప్పుడు ఆరో ఏడో వుంటాయి..అమ్మమ్మ ఇంట్లో ...కరెంటు పోయినప్పుడు... చీకట్లో వుయ్యాలా బల్ల ఎక్కి... తనూ, పెద్దమ్మ కూతురూ...ఇద్దరూ పెద్దయ్యాక ఏమి అవ్వాలో తెగ చర్చించేస్కుంటున్నారు... ఆ గదిలో ఇంకెవ్వరూ లేరనుకుని."నేను బాగా చదువుకుని డాక్టరు అవుతా" అని ఒకళ్ళంటే "డాక్టరు ఐతే ఛీ రక్తం...అన్నీ చూడాలి బాబోయ్" అని అవతలి వాళ్ళూ..."పోనీ టీచరు ఐతే అనుకుంటే మనలాగే పిల్లలు మనల్ని తిట్టుకుంటారు"...అని రెండో వాళ్ళు..ఇలా వాళ్ళకి తెలుసున్న వృతూలన్నింటి గురించి చర్చించుకుంటుంటే ఇంతలోనే కరెంటు వచ్చేసింది...చూసేసరికి ఎదురుగుండా పందిరి మంచం మీద తమ మాటలకి నవ్వుకుంటూ తాతగారు. అయ్యో మా మాటలన్నీ వినేస్తున్నారా ఐతే ఇప్పటిదాకా అని బిక్కమొహాలు వేసిన తామిద్దర్నీ చూసి నవ్వుతూ తాతగారు "ఇలా రండర్రా మీకొక మాట చెప్పాలి" అని దగ్గరికి తీసుకున్నారు.

 అసలూ చదువుకోడం ఎందుకనుకున్నారు? అని అడిగారు...ఇది కూడా తెలీదా అన్నట్టు చూసి...వుద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించడానికి అన్నారిద్దరూ ఏకకంఠంతో...అది కాదర్రా...చదువుకోడం వెనకాల అసలుద్దేశం అది కాదు...జ్ఞానం సంపాదించడం...దాన్ని ఆస్వాదించడం...మన చుట్టూ వున్న వాటి విలువ తెలుసుకోవడం...వాటిని గౌరవించడం...మన జీవితంలో ఎన్నింటికో అర్ధాన్ని వెతకడం...ప్రహల్లాదుడు తన తండ్రి హిరణ్యకశుపుడితో ఏవన్నాడో తెలుసా...

చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు నే
చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ

చదువుకున్నాక వుద్యోగం చెయ్యడం అన్నది అవసరం, అభిలాష వీటన్నింటి మీద ఆధారపడి వుంటుంది...కానీ మీరు గుర్తుపెట్టుకోవలసింది చదువు ప్రధానోద్దేశం డబ్బు సంపాదించడం కాదు...సంపాదన కోసమే ఐతే చదువుకోనక్కర్లేదు...మన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవచ్చు...ఆనందాన్ని ఎలా నిపుకోవచ్చు...మనమూ..మన చుట్టూ వుండేవాళ్ళూ సంతోషం గా comfortable గా ఎలా వుండొచ్చూ...ఇవి నేర్పడం విద్య ముఖ్యోద్దేశం...
                   
ఒక్కసారి ఈ లోకం లోకి వచ్చి నందిని టైము చూస్కుని...మళ్ళీ కంప్యూటర్ వైపు తిరిగి పనిలో పడిందే గాని బుర్ర పూర్తిగా పనిలో మునిగిపోలేకపోతోంది...అప్పుడు తాతగారు చెప్పింది వాళ్ళిద్దరికీ ఏమీ అర్ధం కాలేదు...అసలిప్పటికైనా అర్ధమైందా. ఏడేళ్ళ పిల్లల అలోచన కన్నా ఏమి పరిపక్వత వచ్చింది. ఇంకొకళ్ళతో పోల్చుకుంటూ...వాళ్ళ దారిలో పరిగెట్టడమే కానీ నిజంగా తమకేం కావాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించామా...దేనిలో సంతోషముందో అని వెతికి చూసిందా తనూ...అసలైన ఆనందానికి అర్ధమేవిటో ఎప్పుడైనా ఆగి అలోచించిందా తను...తను ఏరోజైనా ప్రశాంతంగా వుందా...తన చుట్టూ వున్నవాళ్ళని వుంచగలిగిందా...నందిని యంత్రం లా పని చేసుకుని పోతోంది...ఆలోచనల దొంతర్లు చెదిరిన గూటిలోంచి చెల్లా చెదరైన తేనెటీగల్లా మనసుని తలో వైపు లాక్కుపోతున్నాయి...

 పనితోనూ...ముంచెత్తుతున్న అలోచనల అలజడితోనూ విసిగిపోయి ఇంటికి చేరింది ఆరున్నరవుతుండగా...అప్పటికే ఇల్లు చేరి బంటిగాడి పేచీ ని పెద్దగా లెఖ్ఖచెయ్యకుండా టీవీ లో వస్తున్న football ని తీక్షణం గా తిలకిస్తున్న కిషోర్ "ఏవిటోయ్ ఇంత లేటు ...కాస్త కాఫీ నా మొహానపడేద్దూ "అన్నాడు నందిని మొహంలో విసుగుతో తనకేమీ సంబధం లేదన్నట్టు...బంటిగాడి అలకతీరుస్తూ వాడికేవో మాటలు చెప్తూ అలానే కాఫీ కలుపుకొచ్చి సోఫా లో కూలబడింది...కాఫీ పూర్తవ్వగానే రాత్రికేం చేస్తున్నావు..."నాకేమైనా మంచి స్పైసీ గా తినాలనిపిస్తోందోయ్...నువ్వు చేస్తావే స్టఫ్ చేసి దొండకాయ కూర అది చెయ్యకూడదూ"...కిషోర్ ఎప్పుడూ ఇది చెయ్యి అని ఆర్దర్ వేసినట్టు మాట్లాడడు...అలా అని చెసేదాకా వదిలీ పెట్టడు, చిన్న చిన్న విషయాలే కాదు..అన్నింటిలోనూ...ఈ సంగతి నందినికి అర్ధమవ్వడానికి పెళ్ళయ్యాక కొంత సమయం పట్టింది...అర్ధం అయ్యాక ఎప్పుడూ అతను ఏదైనా కోరాకా వాదించాలనో, బుజ్జగించాలనో ఎప్పుడూ ప్రయత్నించి కాలం వృధా చెయ్యలేదు. అలాగే అని సోఫాలోంచి లేచి వెళ్తూంటే వెనకనుంచి కిషోర్ "అదే చేత్తో సాంబార్ కూడా వుంటే"...అన్నాడు టీవీ వైపు నుంచి బుర్ర తిప్పకుండానే...

పడుతూ లేస్తూ...పరిగెడుతూ మధ్యలో బంటి గాడి పేచీలు తీరుస్తూ మొత్తానికి తొమ్మిదవుతుంటే వంట పూర్తి చేసి కంచం లో కూరా అన్నం...పక్కన కప్పులో సాంబారు వేసి కిషోర్ ముందు పెట్టి బంటిగాడికి తినిపించడానికి వెళ్ళబోతుంటే "అరెరే అప్పడాలు వేయించలేదా" అన్నాడు కిషోర్ నిరుత్సాహంగా. అప్పటిదాకా పక్కకి నెట్టి, పని కానిచ్చిన విసుగూ కోపం అంతా ఒక్కసారి వరద గోదారిలా కట్టలు తెంచుకున్నాయి నందినికి...ఏవిటి కిషోర్ నువ్వూ చూస్తున్నావ్ గా...వచ్చినదగ్గర్నుంచీ ఒక్క క్షణం కూడా కూచోకుండా చేస్తూనే వున్నాను...ఎంత పరిగెట్టినా తొమ్మిది లోపు బంటి గాడికి అన్నం పెట్టలేకపోతున్నాను. కనీసం వాడిని నా కాళ్ళకడ్డాం పడకుండా ఆడించడం కూడా చెయ్యవ్... ఇలా పొంగుకొస్తున్న కోపం, బాధా అన్నీ కలిపి మాటల్లో చెప్తుంటే, కిషోర్ మాత్రం చాలా ప్రశాంతంగా, "మా అమ్మ మరి సాంబార్ పెట్టినప్పుడల్లా అప్పడాలు వేయించేది ఆ అలవాటుతో" అంటూ, నందిని కళ్ళల్లోకి చూసి అక్కడే ఆపేశాడు.

నందిని వంట గదిలోకి వెళ్ళి బంటిగాడి కోసం అన్నం చల్లారబెడుతుంటే...కిషోర్ మళ్ళీ నెమ్మదిగా ..."మేవేమైనా అన్నీ నెత్తినేసుకుని చెయ్యమన్నావా...మీకంటే మేము అన్నీ చేసెయ్యగలం...మల్టీ టాస్కింగు మాకు వెన్నతో పెట్టిన విద్య అని పోటీకొచ్చి ఇప్పుడు చెయ్యలేక మానలేకా మా మీద గంతులేస్తే..." అని తనలో తనే అనుకుంటున్నట్టు నందినికి వినపడేలా అంటున్నాడు...

బంటిగాడికి అన్నం తినిపిస్తున్న నందిని కి కిషోర్ మాటలు తన చెవులు దాటి మనసుని తాకాయి...అప్పటిదాకా నీరసం...విసుగు వల్ల వచ్చిన కోపం, చికాకు ని పక్కకు నెట్టి  మనసు ఒక్కసారిగా అలోచనలో పడింది.

నిజవే వీళ్ళెప్పుడూ తమతో సమానమైన పనులు చేస్తే మీరు మాతో సమానమని వొప్పుకుంటామని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. మీరు మాపనులు చేస్తే , మేము మీపనులు పంచుకుంటామని ఏ అగ్రీమెంట్లూ రాయలేదు... సంసారపు బండి కి రెండు సమానమైన చక్రాల్ల భార్యా భర్తలు పనిని సమానంగా విభజించుకుని చేస్తున్నా...ఆడవాళ్ళని చిన్న చూపు చూడటం తో...తాము చేసే పని తక్కువ...వీళ్ళకి లాగే మనమూ సంపాదిస్తే నే మనకి గౌరవం అని మేమే అపార్థం చేసుకున్నట్టున్నాం. మీరు చేసేది కూడా మేము చెయ్యగలం అంటే అది కూడా ఆఖరికి వాళ్ళ requirement list లో చేరిపోయింది...

పన్లన్నీ పూర్తిచేసుకుని పక్కమీదకి చేరినా నందిని అలోచనల పరంపర మాత్రం కంటిమీదకి కునుకుని చేరనివ్వడంలేదు. అసలు తనకెన్ని అభిరుచులు వుండేవి...తనకి నచ్చిన ఒక పుస్తకం చదివి ఎన్నాళ్ళైంది..బంటిగాడితో హాయిగా ఆడుకుని ఎన్నాళ్ళైంది...తనూ కిషోర్ పోట్లాడుకోకుండా నవ్వుతూ ఒక గంట కబుర్లు చెప్పుకుని ఎన్నేళ్ళైంది...అమ్మెప్పుడూ వుద్యోగం చేసి సంపాదించుకుంటే స్వేఛ్ఛగా హాఇగా బతకొచ్చు అని నూరిపోస్తూ వుండేది...తను ఎంత స్వేఛ్ఛ్ గా...హాయిగా బతుకుతోంది...తను చదువుకుంది...చుట్టూ ఎవర్ని చూసినా వుద్యోగం చేస్తున్నారు...తనూ చెయ్యాలనుకుంది...కొత్త సంసారం లో , ఇంటి బాధ్యతలు అంత బరువనిపించలేదు..తనకీ సరదాగానే అనిపించింది...కానీ ఇంట్లో పనులు పెరుగుతున్నా అన్నీ చేసెయ్యాలనే అనుకుంది...తన comfort Jone గురంచి...చేస్తున్న పనిలో తృప్తి గురించి అసలు పట్టించుకుందా...తను చేస్తున్న పని వూపిరాడనివ్వని బందిఖానా లా అనిపించినప్పుడు ఇంక తను పొందుతున్న స్వేఛ్ఛ ఏవిటి? ఇలా అలోచనల్లో కొట్టుకుపోతున్న నందిని మనస్సు ఒక్కసారిగా స్ఠిమితపడింది......తను మర్నాడు ఆఫీసుకి వెళ్ళగానే చెయ్యాల్సిన పని ఏవిటో అర్ధమయ్యి...

                                                               *          *          *

అంతదాకా key board మీటల మీద చకచకా కదులుతున్న ధరణి వేళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. తను తీసుకోగలదా ఆ నిర్ణయం....ఇంటి mortgage, bank loan ఇవన్నీ ఇంక నీ బాధ్యతలే అని అంత సులువుగా తను తప్పుకోగలదా...తను రాస్తున్న కథకి ఈ ముగింపు ఇచ్చే హక్కుతనకి వుందా...ఇలా అలోచిస్తుండగానే లోపల్నుండి నీ offshore call అనుకుంటా...cell ఇక్కడ పడేసి అక్కడేం చేస్తున్నావ్...ఇప్పుడే కాస్త నిద్ర పడుతుంటే...అన్న శరత్ కేకతో వొళ్ళో వున్న PC ని పక్కన పడేసి ఒక్క వుదుటన లోపలకి పరిగెట్టింది ధరణి...

                                           

[తోచినవి రాసుకోటం తప్ప...కథ రాయటం నావల్ల కాదనుకున్న నన్ను...కథ రాయి...ప్రయత్నించు...రాయగలవు అని ఎంతగానో ప్రోత్సహించిన మాలతి నిడదవోలు గారికి కృతజ్ఞతలతో...]