Showing posts with label పుస్తకాలతో నాన్నగారి కబుర్లు. Show all posts
Showing posts with label పుస్తకాలతో నాన్నగారి కబుర్లు. Show all posts

10/23/13

పుస్తకాలతో నాన్నగారి కబుర్లు - 2

అమ్మ కడుపు చల్లగా

రచన -శ్రీ గొల్లపూడి మారుతీ రావు గారి ఆత్మ కథ

పరిచయం - మైలవరపు యజ్ననాధం



అభిమాన రచయితకొక ఆత్మీయ లేఖ



మాన్య శ్రీ  గొల్లపూడి మారుతీ రావుగారికి,

నమస్తే, ఉభయకుశలోపరి.

ఈమధ్య మీ ఆత్మకథ 'అమ్మ కడుపు చల్లగా' చదివే అవకాశం లభించింది. మీ ఆ రచన వెలువడి సుమార 5 సం ॥ లు గడిచిపోయినా నాకు అది చదివే అవకాశం ఈ మధ్యే దొరికింది. నాకు వచన రచనల్లో ముఖ్యంగా ఆత్మకథలు చాలా ఇష్టం. ఇదివరలో తిరుపతి వేంకట కవుల కథలు - గాథలు, టంగుటూరి వారి నా జీవిత యాత్ర, తిరుమల చంద్ర గారి హంపీ నుండి హరప్పా దాకా, శ్రీపాద వారి అనుభవాలూ - జ్నాపకాలూ, డా. ఉప్పల లక్ష్మణ రావుగారి బ్రతుకు పుస్తకం, బాల్యం లో చిలకమర్తి వారి స్వీయ చరిత్ర, కందుకూరి వారి స్వీయ చరిత్ర కూడా చదివాను. వీరిలో కొందరి రచనా శైలీ, గడుసుతనం నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి విలక్షణమైన రీతిమ, తీరూ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వారి రచనలో భేషజం కనపడదు. అత్మాయతా స్పర్శ కనపడుతుంది. ఆ లక్షణం మళ్ళీ మీ రచనలో కాన వచ్చింది. మీ రచన ద్వారా మీరు ఆత్మీయులు గా కనిపించారు. అందుకే మీకీ ఆత్మీయ లేఖ.

'గద్యం కవీనాం వికషం వదన్తి ' అన్నారు పెద్దలు. వచనం రాసి మెప్పించడం కొద్దిమందికే సాధ్యం అయిన విషయం. ఏ రచన గానీ మధ్య లో వొక పేజీ తీసి చదివినా 'ఇది ఫలానా వారి రచన ' అని గుర్తించగలిగిన నాడు, ఆ రచయితకి తిరుగు లేని గుర్తింపు లభించినట్టే. ఆ ముద్ర వేయడం ఏ కొద్దిమందికో గానీ సాధ్యం కాదు. వచన రచనల్లో, స్వీయ చరిత్రలు, నవలలు, కథలు, కథానికలు పలువురివి చదివాను. వాటిలో బేరీజు వేసి చూసినప్పుడు, మీ వొక్కరి రచనా శైలి మాత్రమే శ్రీపాద వారి రచనల సరసన చేరగలదనిపించింది. ఇది మెనమెచ్చు కాదు. నిజాయితీ గా చెప్పిన మాట.

మహా పురుషుల జీవిత చరిత్రలూ, సమాజం లో కొంత పేరు సంపాదించిన వారి చరిత్రలు గ్రంధస్తం చేయబడ్డాయి. కానీ వాటిలో అతిశయోక్తులూ, భట్రాజు పొగడ్తలూ,కొండొకచో విసురులూ చేరి, వాస్తవాలు మరుగున పడవచ్చు.
కానీ స్వీయ చరిత్ర నిజాయితీ గా రచించిన నాడు, అందులో ఆ వ్యక్తి సమగ్ర జీవిత స్వభావ చిత్రణ, వానితో పాటే సమకాలీన సమాజ చిత్రణా - ఇత్యాది అంశాలను చక్కగా గమనించడానికి మంచి అవకాశం దొరుకుతుంది. 

స్వీయ చరిత్రలలో ఆత్మస్తుతి, పరనిందా కాకుండా నిజాయితీగా తమ బలహీనతలను, వోటములనూ కూడా వదలకుండా గ్రంధస్తం చేసినప్పుడు, ఆ మనిషి విలువ మరింత పెరుగుతుంది. మీ జీవిత చరిత్ర కేవలం మీ జీవిత చరిత్ర మాత్రమే కాకుండా ఇటీవలి ఆంధ్ర సారస్వత నాటకచరిత్రలో వచ్చిన పరిణామ క్రమాల దిక్సూచి కూడా.

నిజాయితీగా మీ బలహీనతలనూ, పరాజయాలనూ గ్రంధస్తం చెయ్యడం ద్వారా మీ విలువను మరింత పెంచుకున్నారు.లబ్ధప్రతిష్ఠులయిన వ్యక్తులతో మీ పరిచయాన్నీ, సాన్నిహిత్యాన్ని అలవోకగా ప్రస్తావించి తప్పుకున్నారు. వాటిని hilight చేయడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. మీరు సాధించిన విజయాలను కూడా నమ్రతతోనే ప్రస్తావించడం నన్ను మరింత ఆకట్టుకుంది.

మీ శ్రీమతి యెడల, మీ చిరంజీవుల యెడల మీరు చూపే చిరాకూ, ఒకప్పటి చిత్తూరు నాటక ప్రదర్శనలో స్థానిక తహసిల్దారు మీద మీరు ప్రకటించిన చిరుకోపం, దానిపై శ్రీ బి.కె. రావు (రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి) మిమ్మల్ని సున్నితంగా మందలించిన తీరు - ఇటువంటివి కూడా విడిచిపెట్టకుండా మీ ఆత్మకథ లో స్థానం కల్పించడం మీ సమగ్ర ఆలోచనా విధానానికి మచ్చు తునక.

ముఖ్యంగా మీ కుటుంబం మీద మీకుగల గాఢమైన అనుబంధం చాలా ముచ్చటగొలిపింది. అమ్మగారి యెడల మీకున్న అచంచలమైన భక్తి, చాలామంది మా వంటి వారికి ఆదర్శప్రాయం. అలాగే సహోద్యోగుల మీదా, మీ అభిమానుల మీదా మీకుగల అభిమానం ప్రశంశనీయం.

 అన్నింటికంటే ఎక్కువ నా మనసుని హత్తుకున్నది, స్వర్గస్తులయిన మీ కుమారుడు, శ్రీనివాసుగారిని స్మరిస్తూ, ప్రతిసంవత్సరం మీరు నిర్వహించే స్మారక బహుమతి ప్రదానోత్సవాలు, మొక్కుబడిగా కాకుండా, వారి యెడల మీకుగల ఆప్యాయత చాటుతూ, చలన చిత్ర రంగంలో తెరవెనుక కృషి చేసే సాంకేతిక నిపుణులూ, దర్శకులూ అయిన పలువురు మేధావులను మీరు సత్కరించే విధానం, స్వర్గం నుంచి మీ చిరంజీవి సహస్ర చక్షువులతో చూసి ఆనందిస్తాడని నా ప్రగాఢ విశ్వాసం.

చలనచిత్ర నటుడిగా, నాటక ప్రయోక్త గా,రంగస్థల నటుడిగా ఇప్పటికే మీరు ఎంతో మంది అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. కోట్లాది అభిమానులని సంపాదించుకున్నారు. మిమ్మల్ని రచయిత గా ఆరాధించినా, విలక్షణమయిన మీ నటన, సాహితీ సేవకు ఎంతమాత్రం తీసిపోదు.

చాలా మంది ఏదో ఒక రంగంలో కృషి చేసి పేరు తెచ్చుకుంటారు. కానీ మీరు రచయితగా, నాటక ప్రయోక్తగా, రంగస్థల నటుడిగా, చలన చిత్ర రంగంలో మాటల రచయితగా, చలనచిత్ర దర్శకునిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. చందోబధ్ధమయిన కవితలల్లారు. నాట్యరంగంలో- శాస్త్రీయ సంగీతంలో కూడా తగుపాటి అవగాహన వున్నట్లు మీరు పాల్గొన్న కవిసమ్మేళనాల వల్ల తెలుస్తోంది.

బహుముఖంగా విస్తరించిన, ఇంకా విస్తరిస్తున్న మీ ప్రతిభా సంపత్తులను ఆసక్తిగా గమనిస్తూ, ముందు ముందు సాహితీ సాంస్కృతిక రంగాలలో మీరు చేస్తున్న కృషి మరింత వెలుగొందాలని ఆశిస్తూ మీ అభిమాని అత్మీయ లేఖ.



-యజ్ఞనాధం

గమనిక: ఈ పుస్తకం ప్రస్తుతం కినిగె లో లభ్యం.
             http://kinige.com/kbook.php?id=1355&name=Amma+Kadupu+Challaga 





7/15/13

పుస్తకాలతో నాన్నగారి కబుర్లు


అందరూ పుస్తకాలు పరిచయం చేసేస్తూ, పుస్తకాల గురించి తెగ కబుర్లు చెప్పేస్తూ వుంటే...నేను కూడా బోల్డు పుస్తకాలు చదివేసి ఆ కబుర్లన్నీ రాసెయ్యాలి అనుకునేదాన్ని...ఒక్క పుస్తకం కూడా చివరి పేజీ నంబరు చూసిన పాపాన్న పోలేదు ఇంతవరకూ...

మీ నాన్నగారికేం అలా పుస్తకాల్లో మునిగి తేలుతూ వుంటారు..ఆయనకివేం పట్టవ్...లాంటి కంప్లైంట్లు అమ్మ దగ్గర చాలా కామన్ గా వినబడుతూ వుంటాయి...ఆ మధ్య ఒక పుస్తకాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు నాన్నా అంటే...అటూ ఇటు గా మూడు నాలుగు రోజుల్లో అయిపోతుందమ్మా అన్నారు...అప్పుడు నా బుర్రలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది...నేను పుస్తకం చదివి దాని గురించి రాయడం అన్నది ఇప్పట్లో జరిగే పనిలా ఎలాగూ కనిపించడం లేదు...నాన్నారు ఇలా చదివి అలా విసిరి పడేస్తున్నారు కదా...పడేసే ముందు దాని గురించి కాసిన్ని కబుర్లు రాసి పెడితే అవి నేను ఆయన పేరు మీద కొత్త బ్లాగు తెరిచి రాద్దాం(టైపు చేద్దాం) అనుకున్నా...మళ్ళీ కొత్త బ్లాగు అంటే నా బ్లాగుకున్న ట్రాఫిక్కే అంతంత మాత్రం...దాన్ని పూర్తిగా పైకి తీసుకురాగలనో అనే అనుమానం రావడంతో...నా బ్లాగులో నే ఒక శీర్షిక లో వేద్దాం అని తీర్మానించా...

నా ఈ మెరుపులాంటి ( మరి తళుక్కుమంది కదా) అలోచన చెప్పగానే...మా నాన్నగారు చాలా సంతోషించారు...వొక వారంలో తను అప్పుడు చదువుతూ వున్న పుస్తకం కబుర్లు రాసి, ఇంటర్ నెట్ కేఫ్ కి వెళ్ళి...స్కాన్ తీయించి పంపేసారు (ఇలాంటివి చెయ్యమంటే మీ నాన్నగారికి ఎక్కడలేని వుత్సాహం వచ్చేస్తుంది అని అమ్మ ఇచ్చిన సర్టిఫికెట్టు తీసుకుని మరీ). అది పంపి ఒక రెండు మూడు నెలలు అయ్యింది...కానీ నా చేతుల్లో దానికిప్పటి వరకూ మోక్షం దొరకలేదు పాపం...ఫోన్ చేసినప్పుడల్లా అడిగీ అడిగీ విసిగిపోయి ఈ మధ్య అడగడం కూడా మానేసారు...ఛీ మీ నాన్న కోసం ఈ మాత్రం కూడా చెయ్యలేవు అని ఇవాళ నా అంతరాత్మ తీవ్రం గా నిరశించే సరికి మొతానికి మొదలెట్టా ...

మొదటి పుస్తకం కబుర్లు - సృష్టి లో మధురిమలు 
రచన - శ్రీ గిడుగు రాజేశ్వరరావు
పరిచయం - మైలవరపు యఙ్ననాధమ్





కవి గురించి :
 శ్రీ గిడుగు రాజేశ్వరరావు గారు ఇదివరలో వివిధ ప్రక్రియలలో రచనలు చేశారు. కధానికలు, సంక్షిప్త జీవిత చరిత్రలు, నాటికలు వగైరా. వీరి నాటికలు కొన్ని ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి శ్రీమతి శారదా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రసారమయ్యాయి. అంతేకాకుండా శ్రీ రాజేశ్వరరావుగారు వ్యావహారిక భాషోద్యమ రధ సారధి. గ్రాంధిక భాషా వాదుల పట్ల సింహస్వప్నం అనదగ్గ,  రావు సాహెబ్ గిడుగు రామ్మూర్తి పంతులు గారి మనుమలు. కానీ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవలసిన అవసరం మాత్రం వీరికి ఏనాడూ కలగలేదు. వారే స్వయంగా చేయి తిరిగిన రచయితా, మేధావీ...

 పుస్తక పరిచయం:
సగటు పాఠకుడు పద్యం - వచనం- నవల - కథ వీటిలో చక చకా సాగిపోయే నవలో, లేక కథల వైపో ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. పద్యం అనేసరికి ఒక రకమైన భయం - బెరుకు వుంటాయి.

ఐతే పద్యం మీద సహజంగా ఉండే ఆ భయాన్ని పోగొట్టే ఒక పద్య సంపుటిని ఈ మధ్యే చదవడం జరిగింది. అదే 'సృష్టి లో మధురిమలు '. సప్తవర్ణ దృస్యమాలికతో అనుసంధానమైన రచన. ఇందులోని రచనలు - గేయాలు కావు, వచన కవితలు కావు. తేట యైన తేటగీతుల సంపుటి.

తాను వివిధ సందర్భాలలో, వివిధ ప్రదేశాలలో వీక్షించి పరవశించిన ప్రకృతి చిత్రాలను, సప్త వర్ణాత్మక ఛాయా చిత్రాలుగా బంధించి...వాటితో పాటు పొందు పరిచిన పద్యాల విరిమాల ఈ సంపుటి.

ఈ పద్యాలలో ఎలాంటి శబ్దాడంబరాలు, అలంకారాభరణాలు, అన్వయ కాఠిన్యాలూ లేవు. సూటిగా, సహజ సుందరంగా, నిరాడంబరంగా ఉన్నాయి. ఇవి ముక్తకాలు. ఏ పద్యానికి ఆ పద్యం చదివి ఆనందించవచ్చు. ప్రకృతి గురించి, మానవుల
స్వభావ వైచిత్రి గురించి, అదే సమయంలో ప్రకృతిలో పశు, పక్ష్యాదుల నిర్హేతుకమైన, అవ్యాజ్యానురాగాల గురించి కవి చేసిన విశ్లేషణ చాలా చక్కగా, ఎక్కడా విభేదించే అవకాశం లేని విధంగా వుంది.

కాలం నీటి ధారలా వేళ్ళ సందుల్లోనుంచి జారిపోతుంటే, మధురమైన క్షణాలని మరిచిపోకుండా భద్రపరిచిన తీపి గురుతుల పేటిక వంటి ఈ సంపుటి, ద్రాక్షా పాకం. అన్ని ద్రాక్షలూ వుదాహరణ యోగ్యమే అయినా, మచ్చుకి కొన్ని ఇక్కడ వుంచుతున్నాను.

ప్రకృతి ఒడి లో శిశువుగా పరవశించే వేళ కేరింతలుగా వచ్చిన తేటగీతి ఇది.

ప్రకృతి ఒడిలోన శిశువునై పరవశించచు
వేళ, కేరింతలై నోట వెడలి వచ్చె
తేటగీతుల రూపాన తియ్యనైనన
పద్యములు - తల్లి అందాలు ప్రస్తుతింప

కొన్ని మచ్చు తునకలు












 నిరంతరం తిరిగే సృష్టి చక్రానికి కందెన ప్రేమ తత్వమే కానీ, పగా - ద్వేషం కాదు. మానవుడు ప్రకృతికి దూరం గా జరిగిపోతున్నాడని 'డేవిస్ ' వందేళ్ళ క్రితమే విచారించాడు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే చెప్పలేనంత దూరమే జరిగిపోయాడాన్నది కళ్ళ ముందున్న చేదు నిజం. ప్రకృతిని దైవంగా భావించి ఆరాధించడం, పంచ భూతాలను, పశుపక్ష్యాలను, శిలలనూ కూడా దైవాలకు ప్రతిరూపాలుగా భావించి అర్చించడం అనూచానంగా వస్తున్న మన హైందవ భావన. ఈ భావననే మరొక రకంగా సృష్టిలోని మధురిమలని గుర్తించి, ప్రకృతిని ఆరాధించడం కూడా ఉత్తమ భక్తి మార్గమని నమ్ముతునానన్న శ్రీ గిడుగు చక్కని ఈ భావన సర్వదా సవ్యధా శిరోధార్యం.

మానవునిలో పెరిగిపోతున్న నిర్హేతుక క్రోధం, పగ, ద్వేషం అంతరించాలని, మన బుధ్ధి సత్యమైన మార్గంలో పయనించి శాంతి, సహృదయత వెల్లి విరియాలని, ఆ సుగుణాలని అలవరుచుకోడానికి ఇటువంటి రచనలు కొంతవరకైనా వుపకరిస్తాయని ఆశ, ఆకాంక్ష..